శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో (POCSO) కేసులో నిందితుడికి శిక్ష విధిస్తూ రాజేంద్రనగర్లోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. 2020లో నమోదైన క్రైమ్ నంబర్ 1090/2020 (ఎస్సీ నం. 143/2021) కేసులో, భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 354-ఎ, పోక్సో చట్టం-2012లోని సెక్షన్ 7 రెడ్ విత్ సెక్షన్ 8 కింద నిందితుడిని దోషిగా నిర్ధారించిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి టి. శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. నిందితుడు కపరపు బాబురావు (46)కు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి రూ.50వేల పరిహారం చెల్లించాలని ఆదేశించించారు. ఈ కేసును మాదాపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా సబ్ఇన్స్పెక్టర్ కె. హారిక దర్యాప్తు చేశారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. వెంకటేశ్వర్ రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు విధుల్లో పోలీసు సిబ్బంది సమన్వయంతో కేసు విచారణ పూర్తయి నిందితుడికి శిక్ష పడేలా చర్యలు చేపట్టారు.






