నమస్తే శేరిలింగంపల్లి : అన్నమయ్యపురంలో నాద బ్రహ్మోత్సవ వేడుక నాల్గో రోజు మధురంగా సాగింది. ఈ కార్యక్రమంలో తొలుత శోభా రాజు విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, గురుస్తుతితో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా చలన చిత్ర నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ హాజరై కార్యక్రమాన్ని తిలకించారు.
అనంతరం ప్రముఖ నేపథ్య గాయని మానస ఆచార్య “అదివో చూడరో, ఏ పురాణముల, ఒకపరి కొకపరి, శిరుత నవ్వుల, కంటి అఖిలాండ కర్తని, అభయదయకుడవు, నానా దిక్కుల నారులెల్ల, కులుకక నడవరో, వెంకటాచల నిలయం, నగవులు నిజమని, మత్స్య కూర్మ వరాహ” అనే అన్నమయ్య సంకీర్తనలను మధురమైన గానంతో ఆలపించి నూతన ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమానికి తబలాపై అభిషేక్, కీ బోర్డుపై రాజు వాద్య సహకారం అందించారు. చలన చిత్ర నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ శోభా రాజు సంకీర్తనలు వారి జీవితంలో ఎంతో ప్రభావితం చేశాయని తెలిపారు. వారు అన్నమయ్యపురంలో ఈ నాద బ్రహ్మోత్సవ్ ఉత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం ఏబివి సంస్థ వ్యవస్థాపకురాలు శోభా రాజు, సంస్థ అధ్యక్షులు నందకుమార్ ప్రదర్శితులకు సంస్థ ఙ్ఞాపికనిచ్చి బహుకరించారు. చివరిగా అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే హారతులు ఇచ్చి ప్రసాద వితరణతో కార్యక్రమం ముగించారు.