- మంచానికే పరిమితమైన బాధితుడు.. శస్త్ర చికిత్స తరువాత ఉద్యోగంలో చేరాడు..
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి అనారోగ్య సమస్యను మెడికవర్ హాస్పిటల్ వైద్యులు పూర్తిగా పరిష్కరించారు. హాస్పిటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోన్న 45 సంవత్సరాల వ్యక్తి గత 10 సంవత్సరాలుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. గత మూడు నెలలుగా నొప్పి తీవ్రం కావడంతో అతనికి కూర్చునేందుకు, నిలబడేందుకు ఇబ్బంది అయింది. దీంతో అతను పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాడు.

అయితే ఎన్నో ఆస్పత్రులకు అతను తిరిగినప్పటికీ అతని సమస్యకు తగిన పరిష్కారం మాత్రం లభించలేదు. చివరకు అతను మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్ ను ఆశ్రయించాడు. దీంతో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ‘ట్యూమర్ బోర్డ్ మీటింగ్’ నిర్వహించడంతో పాటుగా తమ బహుళ అంశాల విధానంతో రోగి ఎముకపై సమస్య ఉన్నట్లుగా గుర్తించారు. అతని ఎముకలను స్కాన్/పీఈటీ చేసిన తరువాత అతని వెన్నుముక ఎల్4 ఎముకకు గాయం ఉన్నట్లుగా గుర్తించారు. దీంతోపాటు ఎముక, కీలు నడుమ మృదులాస్థిలో కణితి ఉన్నట్లు గుర్తించారు. న్యూరో సర్జన్లు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ అనిల్కుమార్తో పాటు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ భాను ప్రసాద్లతో కూడిన బృందం చర్చించి శస్త్ర చికిత్స చేయడం ద్వారా కణితి తొలగించాలని నిర్ణయించారు.
సాధారణంగా ఈ తరహా సమస్యలకు ఫిక్సేషన్ ప్రక్రియతో శస్త్రచికిత్స ద్వారా కణతి తొలగింపు చేయడం చేస్తారు. అయితే అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియకు బదులుగా మెడికవర్ హాస్పిటల్ లోని డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, అతని బృందం కంప్యూటర్ గైడెడ్ న్యూరోనేవిగేషన్ విధానాన్ని అమలు చేయడంతో కణితిని తొలగించి సంతృప్తికరమైన ఫలితాలు సాధించారు. రోగి అత్యంత వేగంగా కోలుకోవడంతోపాటు శస్త్ర చికిత్స జరిగిన తరువాత రోజునే అతను నడువ గలిగాడు. వెన్నెముక శస్త్రచికిత్స జరిగిన తరువాత 5వరోజునే అతను తిరిగి తన విధులలో చేరాడు.
మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ఈ సందర్బంగా మాట్లాడుతూ వైద్య సమస్యలను తగిన రీతిలో గుర్తించకపోవడం చేత రోగులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. కానీ మెడికవర్లో బహుళ విధానాలలో సమస్యను పరిశీలించడం వల్ల సమస్యను కచ్చితంగా గుర్తించి చికిత్సనందించడం జరుగుతుంది. దీనివల్ల సంతృప్తికరమైన ఫలితాలను అందుకోగలుగుతున్నామన్నారు. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత కచ్చితత్వంతో సమస్యను గుర్తించడం, నిర్థిష్టమైన చికిత్సనందించడం ద్వారా మాత్రమే ఈ తరహా స్థితిని అధిగమించగలం. కంప్యూటర్ గైడెడ్ న్యూరో నేవిగేషన్ను సరిగ్గా చేయడం ద్వారా మాత్రమే అద్భుతమైన ఫలితాలను పొందగలిగాం.. అని పేర్కొన్నారు.





