శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): సైక్లింగ్, ఫిట్నెస్, ప్రకృతి పరిరక్షణ, బాధ్యతాయుత పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన టూర్ ఆఫ్ అనంతగిరి సైక్లింగ్ ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి 200 మందికి పైగా సైక్లింగ్ ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని అనంతగిరి కొండల మీదుగా 146 కిలోమీటర్ల సైక్లింగ్ ప్రయాణాన్ని పూర్తి చేశారు. అనంతగిరి ప్రాంతంలోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సైక్లిస్టులకు సాహసంతో కూడిన అనుభూతిని అందించడంతోపాటు, ప్రకృతితో బాధ్యతాయుతంగా మెలగడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమం సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించిన అటవీ శాఖ, పర్యాటక శాఖ, సైబరాబాద్ పోలీస్ శాఖలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అటవీ ప్రాంతం మీదుగా సైక్లింగ్ నిర్వహణకు సహకరించడంతో పాటు, ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన బాధ్యతాయుతమైన విధానాలను ప్రోత్సహించినందుకు అటవీ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. అనంతగిరి కొండలను సైక్లింగ్, బాధ్యతాయుత పర్యాటకానికి అనువైన ప్రాంతంగా ప్రోత్సహించేందుకు సహకరించిన పర్యాటక శాఖకు, సైక్లిస్టుల భద్రతతో పాటు కార్యక్రమం సజావుగా సాగేందుకు సహకరించిన సైబరాబాద్ పోలీస్ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

146 కిలోమీటర్ల సుదీర్ఘ సైక్లింగ్ ప్రయాణాన్ని 200 మందికి పైగా రైడర్లు విజయవంతంగా పూర్తి చేయడం హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో సైక్లింగ్, అడ్వెంచర్ కార్యకలాపాలపై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన సైక్లిస్టులు, వాలంటీర్లు, మార్షల్స్, మద్దతుదారులందరికీ బైక్-ఓ-హోలిక్స్ (BOH) హైదరాబాద్ సైక్లింగ్ కమ్యూనిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. టూర్ ఆఫ్ అనంతగిరి కేవలం సైక్లింగ్ ఈవెంట్ మాత్రమే కాదని, సైక్లింగ్, ప్రకృతి, సాహసం, బాధ్యతాయుత పర్యాటకానికి ప్రతీకగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్లో ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద స్థాయిలో నిర్వహించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.





