శేరిలింంగంపల్లి, జూలై 8 (నమస్తే శేరిలింంగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని డైనమిక్ కాలనీ, శ్రీల గార్డెన్ కాలనీల్లో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో జలమండలి డీజీఎం నారాయణ, సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం డీఈ దుర్గా ప్రసాద్, అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీల్లోని ప్రధాన, అంతర్గత రహదారులు, తాగునీటి పైప్లైన్లు, డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల మార్గాలు, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు, చెత్త సేకరణ, పార్కులు తదితర మౌలిక సదుపాయాలను అధికారులు, స్థానికులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. కాలనీవాసులు తమ సమస్యలను నేరుగా శ్రీకాంత్ దృష్టికి తీసుకురాగా, ప్రతి సమస్యను నమోదు చేసి సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడం తమ ప్రధాన లక్ష్యమని శ్రీకాంత్ తెలిపారు. పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాగునీటి సరఫరా మెరుగుదల, పైప్లైన్ లీకేజీల నివారణ, అవసరమైన చోట కొత్త పైప్లైన్ల ఏర్పాటు, అంతర్గత రహదారుల మరమ్మత్తులు, డ్రైనేజీ అభివృద్ధి, వర్షపు నీటి పారుదల వ్యవస్థ బలోపేతం వంటి పనులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జైపాల్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రాజశేఖర్, ఫణికుమార్, జలమండలి అధికారులు, మేనేజర్ విజయ్ కాంత్, వర్క్ ఇన్స్పెక్టర్లు లింగయ్య, నవీన్, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.





