శేరిలింగంపల్లి, జూన్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎం.ఏ. నగర్, స్టాలిన్ నగర్ కాలనీల్లో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరుతూ ఎంసీపీఐ(యూ) మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జలమండలి నార్త్ ట్యాంక్ డివిజన్, హఫీజ్పేట్ జనరల్ మేనేజర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. అధిక జనాభా నివసించే బస్తీలకు ముందుగా తాగునీటిని సరఫరా చేసి, అనంతరం కమర్షియల్ ప్రాంతాలు, తక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు నీటి సరఫరా చేయాలని కోరారు. ఎం.ఏ. నగర్, స్టాలిన్ నగర్ ప్రాంతాల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రత్యేక రిజర్వాయర్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. పేద ప్రజల తాగునీటి హక్కును పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వినతిపై స్పందించిన జీఎం సంబంధిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు కుంభం సుకన్య, అంగడి పుష్ప, డివిజన్ సహాయ కార్యదర్శి పల్లె మురళి, ఎం.ఏ. నగర్ కమిటీ శాఖ సభ్యులు వెంకటాచారి, ఇంద్ర, అమీనా బేగం, స్థానిక బస్తీ వాసులు వేణుగోపాల్ రెడ్డి, జగదీష్, బాల్కొండయ్య, పావని, వీరమణి, ఎన్. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





