శేరిలింగంపల్లి, జూన్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను ఈఆర్ఓ నారాయణ్ అమిత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శేరిలింగంపల్లి వార్డు పరిధిలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 96ను సందర్శించిన ఆయన, ఫారాల పంపిణీ ప్రక్రియతోపాటు అక్కడ చేపట్టిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫారాల పంపిణీ సజావుగా, నిర్ణీత గడువులో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు, ఓటర్లతో నేరుగా మాట్లాడిన నారాయణ్ అమిత్, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని, సమన్వయం, కచ్చితత్వం, సామర్థ్యంతో విధులు నిర్వహించాలని సంబంధిత బృందాలను ఆదేశించారు.

ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని, ప్రతి ఎన్యుమరేషన్ ఫాం సక్రమంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్యుమరేషన్ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఉప కమిషనర్తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.





