శేరిలింగంపల్లి, జూన్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): వికలాంగ చిన్నారులు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ కట్ల శేఖర్ రెడ్డి నెలవారీ నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలో కుటుంబ అవసరాలకు ఉపయోగపడే ముఖ్యమైన వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన, ప్రతి నెలా ఇలాంటి సహాయాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే చిన్నారులు తమ విద్యను నిరంతరంగా కొనసాగించేందుకు అవసరమైన పాఠశాల ఫీజుల విషయంలో కూడా సహకారం అందిస్తామని తెలిపారు. కట్ల శేఖర్ రెడ్డి అందిస్తున్న సహాయంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కట్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి చిన్నారికి విద్యాభ్యాసం చేసే అవకాశం ఉండాలి. గౌరవప్రదమైన జీవితం గడపడానికి అవసరమైన సహాయాన్ని అందించడం మనందరి బాధ్యత అని అన్నారు. వికలాంగులు, నిరుపేద చిన్నారుల సంక్షేమం, విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.





