శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలో సీఎంసీ వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని హఫీజ్పేట్ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ డిమాండ్ చేశారు. కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో సీఎంసీ మియాపూర్ సర్కిల్ డీసీ శశిరేఖకు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హుడా కాలనీలోని మల్లయ్య కుంటను అభివృద్ధి చేయాలని, విద్యావాణి హైస్కూల్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని పార్కుగా మార్చాలని కోరారు. అలాగే హుడా కాలనీ వాటర్ సంప్ ప్రాంతంలో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు వెంటనే ప్రాంతాలను పరిశీలించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డీసీని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రమణయ్య, హఫీజ్పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నరసింహ యాదవ్, కోశాధికారి పవన్ కుమార్, బీజేపీ నాయకులు విజయ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.






