శేరిలింగంపల్లి, మే 4 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతిరోజు ఒక వార్డు (One Ward Every Day)లో భాగంగా 6వ రోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజన కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని కొంపల్లి సర్కిల్ దూలపల్లి వార్డులో క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా కమిషనర్ స్థానిక పౌరులు, కాలనీ సంక్షేమ సంఘాల (RWAs) ప్రతినిధులతో మాట్లాడి పారిశుధ్యం, ఇంజనీరింగ్ పనులు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను సమీక్షించారు. దూలపల్లి ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద చెత్తను తగలబెడుతున్నారని, దీనివల్ల కాలుష్యం పెరుగుతోందని నివాసితులు ఫిర్యాదు చేశారు. స్వచ్ఛ ఆటోల (SAT వాహనాలు) క్రమబద్ధమైన రాకను నిర్ధారించాలని కోరారు. దూలపల్లి శ్మశానవాటిక నిర్వహణ, వాచ్మెన్ నియామకం, సేవా రుసుముల ఖరారుపై ఉన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.

మహాలక్ష్మి కాలనీలో కొత్త సివరేజ్ లైన్ల అవసరం, యుజిడి (UGD) పనులలో లోపాలు, డ్రైనేజీ లీకేజీల సమస్యలను నివాసితులు వివరించారు. మైసమ్మగూడలో గుంతలమయమైన రోడ్లు, వీధి దీపాల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. లింగయ్య చెరువు కలుషితం కాకుండా నిరోధించడానికి మల్లారెడ్డి విద్యాసంస్థల వద్ద ఎస్టీపీ (STP) ఏర్పాటు ప్రతిపాదనను చర్చించారు. దూలపల్లి–షాపూర్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి రోడ్డు వెడల్పు చేయాలని, వీధి కుక్కల బెడదను అరికట్టాలని కోరారు. మహాలక్ష్మి కాలనీలోని పార్క్ భూమిని సంరక్షించి అభివృద్ధి చేయాలని, అలాగే ఎస్సీ శ్మశానవాటికలో గది, బోర్వెల్ సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు.
కమిషనర్ ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్, సంబంధిత విభాగాల అధికారులను ఆదేశిస్తూ.. ఆయా సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయం పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నేరుగా పౌరులతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవడం, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తనిఖీ చేయడం ద్వారా ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. ప్రతి వార్డులో పౌర సేవలను మెరుగుపరచడానికి కార్పొరేషన్ కట్టుబడి ఉందని కమిషనర్ పునరుద్ఘాటించారు. రాబోయే వార్డు సందర్శనల్లో పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు.





