ఎంపీ తేజ‌స్వి వ్యాఖ్య‌లు అవ‌మాన‌క‌రం: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని అవమానించే విధంగా ఉన్నాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జగదీశ్వర్ గౌడ్ మండిపడ్డారు. ఎంపీ తేజ‌స్వి వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం సాధారణంగా ఏర్పడినది కాదని, ఇది ప్రజల దీర్ఘకాల పోరాటం, అమరుల త్యాగాల ప్రతిఫలమని ఆయన పేర్కొన్నారు. అలాంటి చరిత్రను అవమానించడం అంటే తెలంగాణ ప్రజల గౌరవాన్ని అవమానించడం వంటిదేనని స్పష్టం చేశారు.

ఎంపీ తేజ‌స్వి వ్యాఖ్యలకు నిరసనగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మియాపూర్ కాంగ్రెస్ నాయకుడులు, యువనేత యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవంపై ఎవరైనా దాడి చేస్తే యువత ముందుండి ప్రతిస్పందిస్తుంద‌ని, మ‌న‌ రాష్ట్ర గౌరవాన్ని కాపాడటం మ‌న‌ బాధ్యత అని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు ప్రజల ముందు క్షమాపణ చెప్పాల్సిందే అని హెచ్చరించారు. అలాగే తెలంగాణ సాధనకు దారితీసిన పోరాటంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ సేవలను గుర్తు చేస్తూ, రాష్ట్ర అభివృద్ధి దిశగా అదే పార్టీ ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే తన‌ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజనులు, మహిళలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here