శేరిలింగంపల్లి, మార్చి 7 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళలు ఆర్థికంగా బలపడాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ తోపాటు మాజీ మంత్రులు సబిత ఇంద్రా రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి మాధవరం కృష్ణా రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను కేటీఆర్ ఘనంగా సన్మానించారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడడం చాలా అవసరమని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు సమాజం చేయూతను అందించాలని, అందుకు బాధ్యత వహించాలని అన్నారు. యువతులు తమ కాళ్లపై తాము నిలబడితే వారికి వచ్చే గౌరవం వేరేగా ఉంటుందని, ఆ స్వాతంత్య్రం వేరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.






