ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ మంజీర పైప్‌లైన్ రోడ్డుకు సంబంధించి గత అనేక సంవత్సరాలుగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సమస్యపై బీజేపీ రాష్ట్ర నాయకుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జ్ రవి కుమార్ యాదవ్ నేతృత్వంలో, బీజేపీ హఫీజ్‌పేట్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ చొరవ చూపుతూ రోడ్డు సమస్యలను చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంటనే స్పందించి, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో మాట్లాడి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి రైల్వే మంజీర రోడ్డుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవడంతో సమస్యకు పరిష్కారం లభించింది.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ హఫీజ్‌పేట్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ, ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రైల్వే మంజీర రోడ్డుకు ఎట్టకేలకు పరిష్కారం లభించడం ఎంతో ఆనందకరమని పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు సహా సాధారణ ప్రజలు తమ నిత్యావసర ప్రయాణాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా సాగించగలుగుతారని తెలిపారు. అలాగే ఈ అభివృద్ధి పనులకు సహకరించిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, రైల్వే అధికారులకు, జీహెచ్‌ఎంసీ అధికారులకు, ముఖ్యంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు జితేందర్, సీనియర్ నాయకులు రమణయ్య, విష్ణు, పవన్, రాజు ముదిరాజ్, సురేష్ కురుమ, పాలం శ్రీను, రాజు యాదవ్, నర్సింహా యాదవ్, రాంరెడ్డి, వెంకట్, మనోజ్ యాదవ్, వినయ్, నవీన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here