శేరిలింగంపల్లి, జనవరి 7 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పండుగ నేపథ్యంలో మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు, ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్సార్టీసీలకు చెందిన అధికారులతో మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏబుల్ 4, 5, 6 అధికారులు, కేపీహెచ్బీ ఎస్హెచ్వో, కూకట్పల్లి, జీడిమెట్ల, ఆల్వాల్, మేడ్చల్, బాలానగర్, ఆర్సీ పురం, కొల్లూర్ ట్రాఫిక్ ఎస్హెచ్వోలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ మాట్లాడుతూ ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు, ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని, కనుక బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సహకరించాలని సూచించారు.

బస్సు డ్రైవర్లు నిర్దేశించిన స్టాపుల్లోనే బస్సులను నిలపాలని, ప్రయాణికులు బస్సుల్లోకి ఎక్కిన వెంటనే బస్సులను ముందుకు కదిలించాలని దీని వల్ల ట్రాఫిక్ రద్దీ పెరగకుండా ఉంటుందని అన్నారు. ప్రైవేటు ట్రావెల్ బస్సుల డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలను నడపరాదని అన్నారు. బస్సులు అన్నింటినీ ఒకదాని పక్కన ఒకటి కాకుండా ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా నిలపాలని, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు కాకుండా రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ప్రయాణికులను బస్సుల్లోకి ఎక్కించుకోవాలని అన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లు మియాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి తమ పికప్ అండ్ డ్రాప్ పాయింట్ను మియాపూర్ మెట్రో బస్టాప్కు మార్చుకోవాలని సూచించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రైవేటు ట్రావెల్ బస్సుల యాజమాన్యాలు, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.






