శేరిలింగంపల్లి, డిసెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ ను అస్తవ్యస్తంగా విభజన చేశారని GHMC కౌన్సిల్ లో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. జవహర్నగర్ నాలాను హద్దుగా తీసుకుని డివిజన్ విభజన చేస్తే పాలన పరంగా అనేక సమస్యలు వస్తాయని, చందానగర్ డివిజన్ ను నాలా ఆధారంగా విభజించడం సరైంది కాదని పేర్కొన్నారు. అధికారులు చేసిన విభజన వల్ల ఒక కాలనీ రెండు డివిజన్ లలోకి వస్తుందని, దీని వలన ప్రజలకు పరిపాలన ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. చందానగర్ డివిజన్ ప్రజలు కేవలం భౌగోళికంగా కాదు సామాజికంగా, భావోద్వేగపరంగా, సాంస్కృతికంగా ఒకటిగా జీవిస్తున్నారని, అలాంటి ప్రాంతాన్ని ఒక నాలా పేరుతో విడగొట్టడం ప్రజల ఐక్యతను చీల్చడమేనని, పరిపాలనను క్లిష్టం చేయడమేనని అన్నారు. ప్రజాస్వామ్య సమతుల్యతను దెబ్బతీయడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్నగర్ నాలాను విభజించకుండా ముంబై జాతీయ రహదారిని సరిహద్దుగా తీసుకుంటే ప్రజలకు స్పష్టత ఉంటుందని అధికారులకు పని సులభమవుతుందని అన్నారు. చందానగర్ డివిజన్ లో ప్రజలు ఇబ్బందులు పడకుండా డివిజన్ల లోని కాలనీ అసోసియేషన్, కాలనీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చందానగర్ డివిజన్ ను రెండుగా ఏర్పాటు చేయాలన్నారు. ఒక డివిజన్ 3.3 కిలోమీటర్లు ఉండటం వలన ప్రజలకు పాలన పరంగా సమస్యలు వస్తాయని తెలిపారు.






