శేరిలింగంపల్లి, డిసెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): తీవ్రమైన పక్షవాతంతో అనారోగ్యం పాలైన మహిళకు మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు మళ్లీ కొత్త జీవితం ఇచ్చారు. ఆమెకు అత్యంత అరుదైన శస్త్ర చికిత్సను విజయవంంతంగా నిర్వహించారు. ఈ మేరకు హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు వివరాలను వెల్లడించారు. మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ డా. రంజిత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 69 ఏళ్ళ మహిళ తీవ్రమైన పక్షవాతంతో తమ హాస్పిటల్లో చేరిందని, అత్యంత క్లిష్టమైన, ఆధునికమైన న్యూరో స్టెంటింగ్ చికిత్సను విజయవంతంగా అందించడం జరిగిందని అన్నారు. దీని ద్వారా ఆమెను శాశ్వత వైకల్యం నుంచి రక్షించామని తెలిపారు. ఈమెకు వచ్చిన పక్షవాతం చాలా అరుదైనదని, ప్రమాదకరమైనదని అన్నారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన రక్తనాళంలో తీవ్రమైన అడ్డంకి ఏర్పడిందని, దీనివల్ల మెదడులోని సున్నితమైన భాగాలకు రక్తప్రవాహం పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందని, దీనిని వైద్య పరిభాషలో వాటర్షెడ్ ఇన్ఫార్క్ట్ అంటారని తెలిపారు. అధునాతన స్కానింగ్ ద్వారా సమస్యను వెంటనే గుర్తించామని, సమయానికి చికిత్స చేయకపోతే ఆమెకు శాశ్వతంగా వైకల్యం వచ్చే అవకాశం లేదా ప్రాణాపాయం ఉండేదని, కానీ వెంటనే న్యూరో స్టెంటింగ్ చికిత్స చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే అత్యాధునిక స్టెంట్ను ఉపయోగించి అడ్డంకి ఏర్పడిన రక్తనాళాన్ని తెరిచి మెదడుకు రక్తప్రవాహాన్ని పునరుద్ధరించామని అన్నారు. ఈ క్లిష్టమైన, సురక్షితమైన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.






