శేరిలింగంపల్లి, డిసెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మంజీర డైమండ్ హైట్స్ లో స్థానిక ప్రజా సమస్యలపై గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కాలనీ వీధుల్లో పర్యటించి అక్కడి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు తమ కాలనీలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లను పూర్తి చేయాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తక్షణమే స్పందించి అక్కడే ఉన్న అధికారులకు వాటిని నోట్ చేసుకొని వీలైనంత త్వరగా అందుకు అవసరమైన నిధులు కేటాయించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ కాలనీ అభివృద్ధికి ఎల్లవేళలా నిధులు అందుబాటులో ఉంచి సహకరిస్తున్న కార్పొరేటర్ కి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏఈ రషీద్, మంజీర డైమండ్ హైట్స్ కాలనీ వాసులు పి ఆర్ రావు , రాకేష్, అర్జున్, ఫణి సుందరాచారి, సీనియర్ నాయకులు శేఖర్, శ్రీశైలం, వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, మంజీర డైమండ్ హైట్స్ వాసులు, మహిళలు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






