శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్, మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర ప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సంయుక్తంగా గాంధీ శిల్పా బజార్ హస్తకళా ఉత్సవం నిర్వహిస్తున్నారు. తోలు బొమ్మలు, ఇమిటేషన్ జ్యువలరీ, జారీ జర్దోసి, ఎంబ్రాయిడరీ, టటింగ్ లేస్, బాబిన్ లేస్, టై, డై , కొండపల్లి బొమ్మలు, హ్యాండ్ బాగ్స్ ఇలా మరెన్నో హస్తకళా ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. ఆదివారం శ్రీ చంద్ర కళా నిలయం గురువు సంతోష్ పెరుమాండ్ల శశిహాయ్ బృందం పేరిణి లాస్యం అంశాలను ప్రదర్శించారు. పుష్పాంజలి, వినాయక గద్యం, సంధ్య తాండవం, బ్రహ్మ గద్య, శబ్ద పల్లవి, వాణీ గణపతిమ్, రామదాసు కీర్తన, గణపతి దేవరం అంశాలను శ్రీవల్లి, ప్రజ్ఞ, శ్రీవాణి, సింధూశ్రీ, నక్షత్ర, త్రివేణి, కృతి, ప్రవస్తి, మనోజ్ఞ, రమ్య శ్రీ ప్రదర్శించి మెప్పించారు.






