శేరిలింగంపల్లి, నవంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 15న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో బీసీల ఆక్రోశ సభను నిర్వహిస్తున్నామని ఈ సభను జయప్రదం చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ పిలుపునిచ్చారు. 2023 నవంబర్ 10న కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కేంద్రంలో బిజెపి 9వ షెడ్యూల్లో చేర్చి విద్య, ఉద్యోగ , రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 42% బీసీ రిజర్వేషన్ను చట్టబద్ధంగా వెంటనే అమలు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి డిమాండ్ చేసింది.

బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను తక్షణమే అమలు చేయాలని కోరారు. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమితి నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ ఆక్రోశ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీకి వినతిపత్రం సమర్పించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సమితి డిమాండ్ చేసింది. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు , జస్టిస్ ఈశ్వరయ్య , బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహరాజ్ , బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ పాల్గొంటారని తెలిపారు.





