శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): అక్కాచెల్లెళ్ల భరతనాట్య అరంగేట్ర ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. మాదాపూర్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన ఆరంగేట్ర ప్రదర్శనలో కొత్తకాపు హర్షిత రెడ్డి, కొత్తకాపు రుచితారెడ్డిలు భరతనాట్య గురువు సంతోష్ కుమార్ తమంగ్ పర్యవేక్షణలో నాట్య మయూరాలుగా మైమరచి నర్తించారు. షణ్ముఖ కౌత్వం, అలరిపు, జతిస్వరం, శబ్దం, పదవర్ణం, నటనం, ఆడినార్, రామచంద్ర భజన, తిల్లాన అంశాలను భరతనాట్య నృత్యరూపకంలో నర్తించిన తీరు చూపరులను కట్టిపడేసింది. నాట్యం పట్ల ఇష్టం, గౌరవం, సాధన పట్ల ఏకాగ్రతలను వారి నృత్యం ద్వారా చూపించారంటూ కర్ణాటిక్ సంగీత గురువు డాక్టర్ మీనాక్షి పద్మనాభం అన్నారు. ఈ కార్యక్రమంలో హర్షిత, రుచితల తల్లిదండ్రులు గాయత్రి, జగన్మోహన్ రెడ్డి, భరతనాట్య గురువు డాక్టర్ పీ ఇందిరా హేమ, కూచిపూడి గురువు డాక్టర్ విజయపాల్ పతోత్, వోకల్స్ జయకుమార్ భరద్వాజ, గౌతమ్, గోపాలకృష్ణ, రాయప్రోలు సుధాకర్, వెంకటేశం, రవికుమార్ పాల్గొన్నారు.






