శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానమని ఐసీడీఎస్ ఆదిత్యనగర్ సెక్టార్ సూపర్ వైజర్ కోమలి అన్నారు. శేరిలింగంపల్లి ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఆదిత్యనగర్ సెక్టార్ మార్తాండనగర్ అంగన్ వాడీ కేంద్రం 2 లో జరిగిన అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవంలో భాగంగా ఆమె ముఖ్య అతిథిగా హాజరై తల్లి పాలు బిడ్డకి ఎంతో శ్రేయస్కరమని అన్నారు. తల్లి బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రు పాలు పట్టించాలని అన్నారు. బిడ్డకి తల్లి పాలే మొట్ట మొదటి టీకా అని అన్నారు. 6 నెలల వరకు బిడ్డకు తల్లిపాలు కచ్చితంగా ఇవ్వాలని కోరారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పౌష్టికాహారాన్ని తల్లులు, గర్భిణీలు, బాలింతలు వినియోగించాలని కోరారు. అనంతరం మార్తాండనగర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ కార్యకర్త ఎన్.నాగశ్రీలత, గర్భిణీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.






