శేరిలింగంపల్లి, జూలై 31 (నమస్తే శేరిలింగంపల్లి): ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగల ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. గాజుల రామారం పరిధిలోని రోడామేస్త్రీ నగర్కు చెందిన శుభమ్ సింగ్ (21), మహమ్మద్ అన్వర్ (20)లు స్థానికంగా సెంట్రింగ్ కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన విద్యార్థి ధర్మేష్ కున్వర్ (20)తో కలిసి వారు ఆలయాల్లో చోరీలకు పాల్పడడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని పోలీసులు అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించారు. దీంతో వారు చందానగర్లోని గంగారం హనుమాన్ ఆలయం, హుడా కాలనీలోని సాయిబాబా ఆలయం, మియాపూర్లోని ఓ శివాలయంలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో నిందితుల నుంచి పలు బంగారు, వెండి వస్తువులను, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించారు.






