నమస్తే శేరిలింగంపల్లి: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన సమాచారం మేరకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలను, వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సూచించారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మాదాపూర్ లో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి ఆరెకపూడి గాంధీ క్షేత్ర స్థాయిలోకి వెళ్లి స్వయంగా పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ వర్షాలను దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ అధికారులు, మాన్ సూన్, ఎమర్జెన్సీ టీమ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అభద్రతకు లోనుకాకుండా ధైర్యంగా ఉండాలని, ఎక్కడ ఏ సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆయన వెంట ఈఈలు శ్రీకాంతిని, శ్రీనివాస్, ఏఈలు ప్రశాంత్, జగదీష్, ట్రాఫిక్ ఏసీపీ హన్మంతరావు , ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
