కూకట్పల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై స్వచందంగా ప్రజలు తెరాస పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన పలువురు యూత్ నాయకులు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి గాంధీ తెరాస పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. పార్టీలో ప్రతి కార్యకర్తను గౌరవిస్తామని అన్నారు. అందరూ కలిసి బంగారు తెలంగాణను సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి అండగా ఉండాలని అన్నారు. బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుదామని పిలుపునిచ్చారు. తెరాస ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి ద్వారా పేదింటి ఆడపిల్లకు రూ.1,00,116 ఇవ్వడం జరుగుతుందని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన మంజీరా నీరు అందిస్తున్నామని, ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళా పింఛన్లు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి అనేక గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెరాస పార్టీని నియోజకవర్గంలో మరింత బలపరుస్తామని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తూ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలని సూచించారు. పార్టీలో అందరినీ కలుపుకొని సమన్వయంతో పని చేస్తూ తెరాస పార్టీని పటిష్ట పర్చాలని అన్నారు. తెరాస పార్టీలో చేరిన వారిలో నీల వంశీ గౌడ్, సాయి కుమార్, మహేష్, భరత్, పవన్, రాహుల్, రాజేష్, సాయి, అరుణ్ కుమార్, సంజీత్, అంజి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, తెరాస నాయకులు ఎల్లం నాయుడు, గడ్డం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.