- చిన్నారులను ఆకట్టుకున్న రంగురంగుల పక్షులు, బోటు షికారు
- సందర్శకుల రాకపై హర్షం వ్యక్తం చేస్తున్న దుఖాణదారులు
నమస్తే శేరిలింగంపల్లి: చాలా రోజుల తర్వాత మాదాపూర్ శిల్పారామం సందర్శకులతో కళకళలాడింది. కరోనా రెండవ దశ నేపథ్యంలో మే 12 నుంచి లాక్డౌన్ మొదలైన కారణంగా శిల్పారామం పూర్తిగా మూత పడింది. అంతకు ముందు నైట్ కర్ఫ్యూతో పాటు కరోనా విజృంభన కొనసాగిన నేపథ్యంలో మార్చి నెల నుంచే శిల్పారామంకు సందర్శకులు తాకిడి తగ్గింది. కాగా ప్రభుత్వం తాజాగా లాక్డౌన్ను ఎత్తివేయడంతో సోమవారం నుంచి శిల్పారామం పునఃప్రారంభమయ్యింది. దాదాపు రెండు నెలలుగా ఇళ్లకే పరిమిత మైన జనాలు ఎట్టకేలకు శిల్పారామం బాటపట్టారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ, నచ్చిన వస్తువులు కొంటు, బోటు షికారు, బ్యాటరీ కారులో సవారి చేస్తు సందడి చేశారు.
చిన్నారులు అక్కడి రంగురంగుల పక్షులను చూస్తూ, వాటి కిలకిల రావాలకు మంత్ర ముగ్ధులయ్యారు. ఇక హస్తకళాకారులు, ఇతర దుఖాణదారులకు సందర్శంకుల రాకపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలలుగా వ్యాపారం లేక అవస్థలు పడ్డామని, ఇక తమ కష్టాలు తీరుతాయనే ఆశాబావం వ్యక్తం చేశారు. ఐతే లాక్డౌన్ ఎత్తివేసినప్పటికి కరోనా పూర్తిగా కట్టడి చేయబడలేనందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు శిల్పారామం అధికారులు తెలిపారు. సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత విషయంలో శ్రద్ధ వహించాలని కోరారు. శిల్పారామం ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు తెరిచే ఉంటుందని, నగరా వాసులు సేదతీరే ఈ అశకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.