మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ గ్రాడ్యుయేషన్ నియోజకవర్గాల అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ కల్యాణ్ గార్డెన్ లో సోమవారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి, గ్రాడ్యుయేషన్ నిరుద్యోగులు, యువత, మహిళలు, అన్ని రంగాల కార్మికులు, ప్రైవేట్ స్కూల్స్ తదితర అంశాలపై శాసనమండలిలో ప్రజల గొంతుకగా పని చేస్తానని అన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది యువత డిగ్రీలు పూర్తి చేసి రోడ్డుమీద తిరుగుతున్నారని ప్రభుత్వం వారికి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోగా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కరోనా పరిస్థితిలో ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ పూర్తిగా రోడ్డున పడ్డారని అన్నారు. ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రైవేట్ స్కూల్స్ పైన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఒకవైపు నిరుద్యోగ యువత, మరోవైపు అసంఘటిత రంగ కార్మికులు, రైతులు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక రాజకీయ పార్టీలు ధనం, కులం తదితర అంశాలను తీసుకుని పోటీలు చేస్తున్నాయని తను మాత్రం నిరుద్యోగ యువత, కార్మిక ఉపాధ్యాయుల సమస్యలపై గొంతుగా అసెంబ్లీలో మాట్లాడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శోభన్, కృష్ణ, సాధినేని శ్రీనివాస్, శ్రీనివాస్ పాల్గొన్నారు.






