- తెలంగాణ బహుజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు చంటి ముదిరాజ్ డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక అవస్తలు పడుతున్నారని తెలంగాణ బహుజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు చంటి ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర వసతులతోనే నెట్టుకొస్తున్నారని, సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థుల సమస్యలపై ఆదివారం ప్రకటనలో తెలిపారు.
పేద విద్యార్థులకు మౌలిక వసతులతోపాటు విద్యలో మెలకువలు పాటించి, ఉన్నతంగా రాణించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన వసతి గృహాలు నిర్లక్ష్యానికి నిలయాలుగా మారుతున్నాయని, కనీసం విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా అందడం లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు సన్నబియ్యం లేక దుప్పట్లు సమయానికి అందక.. ఇలా ఎన్నో సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని, వీటి నిర్వహణపై అధికారులు పర్యవేక్షణ కొరబడిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తక్షణమే ప్రభుత్వ వసతి గృహాల్లో తాగునీటి సమస్య తీర్చాలని ప్రభుత్వాన్ని ప్రకటనలో కోరారు.