శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మల్కం చెరువు వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్లో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కుటుంబ సమేతంగా వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నిమజ్జనానికి ముందు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. అనంతరం భక్తి భావంతో గణనాథుడి విగ్రహాన్ని మల్కం చెరువులో నిమజ్జనం చేశారు. ప్రజలందరికీ విఘ్నాలు తొలగి సుఖసంతోషాలు, శాంతి, అభివృద్ధి కలగాలని గణనాథుడిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ.. ప్రతి ఏటా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిమజ్జన కేంద్రాల్లోనే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.





