శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ ధరిత్రీ దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని మసీదు బండలో ఉన్న జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు D. ఉమాదేవి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ ఎర్త్, సముద్రము, పర్యావరణ శాస్త్ర ఆచార్యులు G. కిషోర్ కుమార్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు మద్దతును ప్రదర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వార్షిక కార్యక్రమం ఎర్త్ డే. భవిష్యత్ తరాల కోసం మన గ్రహాన్ని కాపాడుకోవడంలో మన బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది.
కాలుష్యం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పు, అంతరించిపోతున్న జాతులు వంటి పర్యావరణ సమస్యల గురించి అవగాహన పెంచడానికి ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది వ్యక్తులు, సంఘాలు, ప్రభుత్వాలు భూమి సహజ వనరులను సంరక్షించడానికి చర్యలు తీసుకోవాలని ప్రోత్సహిస్తుందన్నారు. ఈ సందర్భంగా అందరిచేత పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస్, రజని, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు పాలం శ్రీను, జిల్ మల్లేష్, కొండా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.