శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్య, అత్తపై దాడి చేయగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అతని భార్య స్వల్ప గాయాలతో చికిత్స పొందుతుండగా, అతని అత్త పరిస్థితి విషమంగా ఉంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్ జనప్రియ నగర్ లో నివాసం ఉండే బందరు లంక మహేష్ (33) స్థానికంగా క్యాబ్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 2022 మే 4న కడమంచలి శ్రీదేవి అనే మహిళతో వివాహం కాగా తన భార్యతో కలిసి జనప్రియ నగర్లోనే నివాసం ఉంటున్నాడు. వీరికి అమృత అనే 2 సంవత్సరాల కుమార్తె కూడా ఉంది. అయితే గత కొంత కాలంగా మహేష్ మద్యానికి బానిసై ఎలాంటి పనిచేయకుండా రోజూ విపరీతంగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య శ్రీదేవిని చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం కూడా తన భార్యతో గొడవపడ్డాడు. అదే సమయంలో అతను కత్తితో ఆమెపై దాడి చేయగా ఆమె తన తల్లి కడమంచలి మంగ (45)కు ఫోన్ చేసింది. దీంతో కుమార్తె పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె వెంటనే తన కుమార్తె ఇంటికి వచ్చి మహేష్ను నిలదీసింది. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన మహేష్ శ్రీదేవి, మంగ ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీదేవికి స్వల్ప గాయాలు కాగా ఆమె తల్లి మంగకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆ ఇద్దరినీ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించగా మంగ పరిస్థితితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త మహేష్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.