శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (A I F D W) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బడ్జెట్లో మహిళా సంక్షేమానికి 20 శాతం నిధులు కేటాయించాలనే డిమాండ్ తో రాష్ట్ర రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మియాపూర్ డివిజన్ ఓంకార్ నగర్ లో AIFDW గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వి అనిత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర కోశాధికారి తాండ్ర కళావతి మాట్లాడుతూ స్వాతంత్ర్య దేశంలో నేడు స్త్రీ అన్ని రంగాల్లో అణిచివేతకు గురవుతుందని, ఇప్పటికీ 114 అంతర్జాతీయ మహిళా దినోత్సవంలు జరిగినా భారతదేశంలో పాలకులు ఎవరైనా స్త్రీ హక్కుల పరిరక్షణలో, భద్రతలో ఘోరంగా వైఫల్యం చెందారు అని అన్నారు.
2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి రోజు రోజుకు స్త్రీ ని బానిస సమాజం నాటి స్థితికి నెట్టి వేసే కుట్రలు అనేకం చేస్తుందని, స్త్రీ బానిసగా ఇంట్లో పడి ఉండాలని ఆదేశిస్తున్నదని అన్నారు. ఈ విదానాన్ని నేటి మహిళ సమాజం సావిత్రి బాయి పోరాట స్ఫూర్తితో తిప్పి కొట్టాలని, స్త్రీ పురుష సమానత్వం కోసం సమరశీల ఉద్యమాలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ నాయకులు జి శివాని, బి విమల,జి లలిత, స్థానిక మహిళ లు తదితరులు పాల్గొన్నారు.