శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఆమె అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ లో మహిళల కోసం ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల కోసం బ్యూటీ పార్లర్ మెళకువలు, కుట్టు మిషను, నర్సింగ్ కోర్సులు, బేకరి తయారీ విధానం వంటి అనేక కోర్సులను అందించడం జరుగుతుందని అన్నారు.

మహిళలను అభివృద్ధి పథంలో నడిపేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అనంతరం సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆమె చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆర్గనైజర్స్ చంద్రకళ, అరుణ, సౌజన్య, రజిని, భూదేవి, కమల, నజిమ, గౌష్య, రాములమ్మ, కుమారి, జయమ్మ, శశికళ, శిరీష, సుజాత, స్వరూప, లత, రోజా రాణి, నాజియా, వాటర్ కమిటీ సభ్యులు మహేందర్, శ్రీకాంత్, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బస్వరాజ్, సబియా పాల్గొన్నారు.





