శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎంఐజి కాలనీలోని ఇందిరా గాంధీ మహిళా భవన్లో జరిగిన జనశక్తి సంస్థాన్ (స్కిల్ ఇండియా) మహిళా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు ఆయన సర్టిఫికెట్లను అందజేశారు. మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు జ్యోతి, సావిత్రి, భారతి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిరి, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు ఉరిటీ వెంకట్ రావు, నర్సింగ్ ఠాకూర్, ప్రవీణ్, సునీల్ విశ్వనాథ్ తో కలిసి జగదీశ్వర్ గౌడ్ మహిళలకు సర్టిఫికెట్లు అందించారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని, ఇందిరా మహిళా శక్తి పథకం వంటి కార్యక్రమాలను ప్రారంభించిందని, వడ్డీ లేని రుణాలు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి మహిళాలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని, ప్రమాద బీమాను అందిస్తోందని అన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రాజెక్టులకు క్రెడిట్ అందించడం, నిర్దిష్ట శిక్షణ, కౌన్సెలింగ్ నిర్వహించడం, సంబంధిత ప్రాజెక్టులపై సమాచారాన్ని సేకరించడం ద్వారా మహిళలను సాధికారపరచడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని జగదీశ్వర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక స్వాతంత్ర్యం, సాంస్కృతిక పరిరక్షణ, మహిళా ప్రాతినిధ్యంపై దృష్టి సారించి ప్రభుత్వం మహిళలకు సాధికారత కల్పించడం, వారి పురోగతిని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.