శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి సుమారు 1వేయి మంది TRS నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా హాజరయ్యారు. ఈ విషయాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ TRS ఇన్చార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపారు. సభలో మాట్లాడిన కల్వకుంట్ల కవిత.. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలకు నిజమైన సామాజిక న్యాయం అందించే తెలంగాణ నిర్మాణం TRSతోనే సాధ్యమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, మహిళలు, నిరుద్యోగ యువత, రైతుల హక్కుల పరిరక్షణకు పార్టీ కట్టుబడి ఉందని ఆమె అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే ఈ సంకల్ప సభ నిర్వహిస్తున్నట్లు కవిత వెల్లడించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో సామాజిక న్యాయ తెలంగాణపై సమావేశాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సంక్రాంతి అనంతరం సామాజిక న్యాయం కోసం వేలాది మంది కార్యకర్తలతో ఢిల్లీకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన అస్లాం, దయానంద్, కుమార్, విష్ణు, మురుగేశన్, ప్రవీణ్, సూర్యప్రకాశ్, యాదగిరి, రాంభూపాల్ రెడ్డి, స్వామిగౌడ్, వలి, చందు, అసిఫ్, లక్ష్మి, మాధవి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని TRS నాయకులు, కార్యకర్తలకు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.





