శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మెట్రోపాలిటన్ మున్సిపల్ కార్పొరేషన్ (MMC) ప్రాంతాలకు ఈ నియామకం వర్తించనుంది. ఈ సందర్భంగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ గ్రేటర్ హైదరాబాద్లో తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

రాబోయే జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లలో పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానని వాసిలి తెలిపారు. మెజారిటీ కార్పొరేటర్ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని చెప్పారు. అదే విధంగా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కవితను ముఖ్యమంత్రిగా చేయడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, ఎన్నికల్లో సత్తా చాటేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.





