శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, కమిషన్లకు కక్కుర్తిపడి అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేయడం లేదని యం సి పీ ఐ (యు ) మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఆయన పలువురు యం సి పీ (యు) నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఇస్లావత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారుతున్నదని, మియాపూర్ ప్రాంతంలోని ఎం ఎ నగర్, స్టాలిన్ నగర్, నడిగడ్డ తాండ, హె డి ఎఫ్ సి (HDFC) బ్యాంక్ హై టెన్షన్ రోడ్ తదితర ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగిపొర్లుతున్నదని, మ్యాన్ హోల్స్ ఎక్కడికక్కడ విరిగిపడ్డాయని అన్నారు. అయినప్పటికీ అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడి సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదన్నారు. తక్షణం డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని, ధ్వంసమైన మాన్ హోల్సు కు మరమ్మత్తులు చేపట్టాలని, లేకపోతే జన సమీకరణ చేసి సంబంధిత కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యం సి పీ ఐ (యు ) మియాపూర్ డివిజన్ సహాయ కార్యదర్శి పల్లె మురళి, స్థానిక పార్టీ సభ్యులు మైదం శెట్టి రాణి, డి శ్రీనివాసులు, స్థానికులు పాల్గొన్నారు.






