శేరిలింగంపల్లి, ఏప్రిల్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రంగారెడ్డి జిల్లా నాయకులు మియాపూర్ బస్ డిపో 1 & 2 వద్ద భారీగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్ మాట్లాడుతూ శంకర్ గౌడ్ మృతి అత్యంత దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. RTC ఉద్యోగుల భద్రత, సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. అలాగే బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు పొనుగోటి సందీప్, శాగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.






