- రైతుల సహాయార్థం రూ.1,00,116 విరాళాల సేకరణ
శేరిలింగంపల్లి, నవంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్లో ఉన్న త్రివేణి స్కూల్ ప్రాంగణం విద్యార్థుల కేరింతలు, కోలాహలం మధ్య పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా డా. వీరేంద్ర చౌదరి ప్రేరణతో త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ల మండలి, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు కలిసి మహోన్నతమైన సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల సహాయార్థం నిధుల సేకరణ కార్యక్రమం ద్వారా అసాధారణంగా రూ.1,00,116 సేకరించారు.త్రివేణి విద్యాసంస్థల అన్ని బ్రాంచిలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి సేకరించిన మొత్తాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని కలిసి ఆయన ద్వారా రైతులకు అందజేయనున్నట్లు స్కూల్ నిర్వాహకులు తెలిపారు.

ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న డా. వీరేంద్ర చౌదరి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉత్సాహంగా తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పుచ్చకాయతో తయారు చేసిన ప్రత్యేక కేక్ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం డా. వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ రైతన్నలకు సహాయం చేయడం తమ విద్యాసంస్థ సామాజిక బాధ్యతగా భావిస్తామని అన్నారు. ఈ గొప్ప సేవా యజ్ఞంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావడం తమకు ఎంతో గర్వకారణమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో త్రివేణి స్కూల్స్ సెంట్రల్ టీమ్, జోనల్ టీమ్, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డైరెక్టర్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.






