- గచ్చిబౌలి లో అత్యధికంగా 43.08 శాతం
- మియాపూర్ లో అత్యల్పంగా 36.34 శాతం
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎప్పటిలాగే పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఎవరెంతగా అవగాహన కల్పించినా ఓటర్లు ఓటు వేసేందుకు ఇల్లు వదలి బయటకు రాలేదు. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో మొత్తం 46.60 శాతం పోలింగ్ నమోదైంది. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 42.04 శాతం నమోదు కగా, 2016 ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ నమోదైంది. గతేడాదితో పోలిస్తే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగినా మొత్తంగా చూస్తే ఈసారి కూడా పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది.
శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలో మూడు డివిజన్లలో కలిపి మొత్తం 41.80 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. డివిజన్ల వారీగా చూస్తే కొండాపూర్(104) డివిజన్ లో 69,546 మంది ఓటర్లు ఉండగా 28,746 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 41.33 గా నమోదైంది. గచ్చిబౌలి(105) డివిజన్ లో 50,876 ఓటర్లకు గాను 21,918 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 43.08 గా నమోదైంది. శేరిలింగంపల్లి (106) డివిజన్ లో 65,550 మంది ఓటర్లలో 27,076 మంది ఓటు వేశారు. 41.31 శాతం పోలింగ్ నమోదైంది.
చందానగర్ సర్కిల్ 21 పరిధిలో నాలుగు డివిజన్లలో కలిపి మొత్తం 38.26 శాతం పోలింగ్ నమోదైంది. మాదాపూర్(107) డివిజన్ లో 58,126 మంది ఓటర్లు ఉండగా 22,447 ఓట్లు పోలయ్యాయి. 38.62 శాతం పోలింగ్ నమోదైంది. మియాపూర్(108) డివిజన్ పరిధిలో 58,165 మంది ఓటర్లు ఉండగా 21,136 ఓట్లు పోలయ్యాయి. 36.34 శాతం పోలింగ్ నమోదైంది. హఫీజ్పేట్(109) డివిజన్ లో 70,479 మంది ఓటర్లు ఉండగా 27,571 మంది ఓటు వేశారు. 39.12 శాతం పోలింగ్ నమోదు అయింది. చందానగర్(110) డివిజన్ లో 60,111 మంది ఓటర్లు ఉండగా 23,313 ఓట్లు పోలయ్యాయి. 38.78 శాతం పోలింగ్ నమోదు అయింది.

కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకవైపు ఓటర్లు పోలింగ్ పట్ల శ్రద్ధ చూపకపోగా మియాపూర్ న్యూకాలనీ ఎంపీపీ స్కూల్లోని పోలింగ్ బూత్ నం.76లో మాత్రం బడుగుల అనే కుటుంబంలోని 3 తరాలకు చెందిన సభ్యులు విధిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో వారి బాధ్యతను నిర్వర్తించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.