కేసీఆర్ పై కుట్రలు చేస్తే ఊరుకునేది లేదు: రవీందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 1 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కుట్రలకు పాల్పడుతున్నదని శేరిలింగంపల్లి యువనేత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్ అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌పై విచార‌ణ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం సీబీఐకు అప్ప‌గించ‌డాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను శాశ్వతంగా మూసేసి, నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్ కుట్రలో భాగం ఇద‌న్నారు. సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే ప్రాజెక్ట్‌ను పూర్తిగా మూసేయడమేనని మండిపడ్డారు. నిన్నటిదాకా సీబీఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చిన‌ట్లు అని ప్ర‌శ్నించారు. దీని వెనుక ఉన్న శక్తులు, వాటి ఉద్దేశాలేమిటో ప్రజలకు తెలుపాల‌ని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను శేరిలింగంపల్లి గులాబీ శ్రేణులు ఎదుర్కోవాలని రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఇది కేసీఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదన్నారు. తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నద‌న్నారు. ఇది కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకం, వాళ్లు చేస్తున్న కుట్రే అని అన్నారు.

కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామ‌న్నారు. ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, బీజేపీ డైరెక్షన్‌లో కేసీఆర్‌పై కుట్ర చేస్తున్న‌ట్లు దుయ్య‌బ‌ట్టారు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేద‌న్నారు. కేసీఆర్ పై విచారణ అంటేనే తెలంగాణ రైతాంగాన్ని అవమానించినట్లే అన్నారు. బడే భాయ్ చోటే భాయ్ లు కలిసి కేసీఆర్‌ను తట్టుకోలేక కుట్రలు పన్నుతున్నార‌న్నారు. తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి పోరాడిన కేసీఆర్ పై కుట్రలు చేస్తే ఊరుకునేది లేద‌ని రవీందర్ యాదవ్ హెచ్చరించారు. కమిషన్ నివేదికపై మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా ప్రభుత్వం గొంతు నొక్కింద‌న్నారు. తెలంగాణ కోసం ఏనాడు జైలుకు వెళ్లని వ్య‌క్తి, జై తెలంగాణ నినాదం చేయని వ్య‌క్తి, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలంతా గమనిస్తున్నార‌ని, ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పద‌ని రవీందర్ యాదవ్ హెచ్చరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here