వంద శాతం ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం చేరుకోవాలి: జడ్‌సీ హేమంత్ బోర్ఖడ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బల్దియాలో తగు ప్రాధాన్యత కలిగిన శేరిలింగంపల్లి జోన్‌లో ఆస్తి పన్ను వసూళ్లను అత్యంత పకడ్బందీగా వసూలు చేయాలని జోనల్‌ కమీషనర్‌ హేమంత్ బోర్ఖడే పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాన్ని గడువులోగా వంద శాతం చేరుకోవాలని ఆదేశించారు. కొన్ని డాకెట్ల‌లో సాధారణ పురోగతి నమోదవుతున్నదని వాటిల్లో సిబ్బంది మరింత కృషి చేయాలన్నారు. జోన్‌ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్ల పురోగతిపై డీసీలు, పన్ను విభాగం ఏఎంసీలు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ల‌తో జోనల్‌ కమీషనర్‌ హేమంత్ బోర్ఖడే మంగళవారo జోనల్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్‌ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్‌, పటాన్‌చెరు, ఆర్‌సీపురం సర్కిళ్ల వారీగా ఇచ్చిన లక్ష్యంతో పాటు చేరుకున్న లక్ష్యాన్ని 34 డాకెట్ల వారీగా సమీక్షించారు.

అనంతరం జడ్‌సీ హేమంత్ బోర్ఖడే మాట్లాడుతూ 2025-26 ఆర్థికక సంవత్సరానికి గాను రూ. 557.25 కోట్ల లక్ష్యం నిర్థరణ కాగా ఇప్పటి వరకు రూ. 326.58 కోట్ల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకున్నట్లు పేర్కొన్నారు. వేడుకలు, పలు ఎన్నికలు , పండుగల నేపథ్యంలో కొంత మేర పన్ను వసూళ్ల పురోగతి మందగించిందని, ఇక నుంచి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని జడ్‌సీ సూచించారు. ప్రధానంగా శేరిలింగంపల్లి, చందానగర్‌ సర్కిళ్లు మరింత పురోగతిని చూపించాలని ఆదేశించారు. కొన్ని డాకెట్లలో పన్ను వసూళ్లు ఆశాజనకంగా లేవని, సంబంధిత ఏఎంసీలు పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టి వేగవంతం అయ్యేలా చూడాలని జడ్‌సీ హేమంత్ బోర్ఖడే ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో అయిదున్నర నెలలే ఉన్నందున ఆస్తి పన్ను వసూళ్ల వంద శాతం లక్ష్యాన్ని గడువులోగానే చేరుకోవాలని స్పష్టం చేశారు. ఇక నుంచి ఈ ప్రక్రియపై నిరంతరం సమీక్షలు చేపడతామని, అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకోబోమని జోనల్‌ కమీషనర్‌ హేమంత్ బోర్ఖడ్ పేర్కొన్నారు. ఆస్తిపన్ను వసూళ్లపై అభివృద్ధి పనులు ఆధారపడి ఉన్నందున సిబ్బంది మరింత మెరుగైన పనితీరును కనబరచాలన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here