శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాథమ్ చెరువు సుందరికరణలో భాగంగా Nexus select Malls కంపెనీ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ గుర్నాథమ్ చెరువు పునరుద్ధరణ ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం మధ్య భాగస్వామ్య ప్రయత్నాలు అర్ధవంతమైన పర్యావరణ పురోగతిని ఎలా నడిపించగలదో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ కీలకమైన సహజ వనరులను పునరుజ్జీవింపజేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో సుస్థిరమైన అభివృద్ధి కోసం ఒక నమూనాను ఏర్పాటు చేస్తుందని అన్నారు.
గుర్నాథమ్ చెరువుకు నేటితో దశ దిశ మారింతని, ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరుతుందని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టడం జరిగిందని, మురికి కూపంలాంటి చెరువును స్వచ్చమైన మంచి నీరు లాంటి చెరువుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేసి నిరూపించడం జరుగుతుందని అన్నారు. చెరువు పునర్జీవనం తరువాత సుజల జలంతో అపురూప దృశ్యకావ్యంగా ఆవిష్కృతమవుతుందన్నారు. చెరువు కట్ట చుట్టూ చెట్లు పెంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేశారు. Nexus Select Malls CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుందరీకరణ చేపట్టేందుకు ముందుకు రావడం చాలా అభినదించదగ్గ విషయం అని, సమాజ హితం , సమాజ సేవ చేయడం కోసం ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ సంస్థ ప్రతినిధులు రామ్ బొట్ట, చైతన్య, కాలనీ వాసులు రమేష్, అవినాష్ , లోకేష్, నాగసుబ్బరెడ్డి, కార్తికేయ శ్రీనివాస్, రామకృష్ణ, సాయి ప్రశాంత్, వివేకానంద, రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.