శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): హిందూ ధర్మం అనేది కేవలం ఒక మతం కాదని, అది మన జీవన విధానమని, ధర్మో రక్షతి రక్షితః అంటే మనం ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందని తెలుగుకవి, శతావధాని మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. ఆదివారం కొండాపూర్ మసీద్ బండ గ్రామంలో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ తో కలసి మాడుగుల నాగఫణి శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాడుగుల నాగఫణి శర్మ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, పాశ్చాత్య సంస్కతి వైపు మొగ్గు చూపుతూ మన మూలాలను మర్చిపోకూడదని అన్నారు. రామాయణ, మహాభారతాల్లోని విలువలను నేర్చుకుని, మన పండుగలలోని అర్ధాలను తర్వాతి తరానికి అందించాలన్నారు. హిందువులందరూ సంఘటితం కావాలన్నారు.

రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ హిందువుల కోసం, హిందూ దేవాలయాల కోసం పోరాడుతున్నది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమేనని, దశాబ్దాల నిరీక్షణ తర్వాత కోట్లాది హిందువుల కల అయిన అయోధ్య రామమందిరాన్ని నిర్మించుకున్నామని, ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఇది హిందూ ఆత్మగౌరవ చిహ్నమని అన్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ అయినా, ఉజ్జయిని మహాకాల్ లోక్ అయినా హిందూ ధర్మ వైభవాన్ని పునరుద్ధరించడమే బిజెపి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బల్దా అశోక్, పురుషోత్తం, ప్రసాద్, సందీప్ యాదవ్, శ్రీశైలం యాదవ్, అరుణ్, కరణ్ గౌడ్, సహదేవ్ పాల్గొన్నారు.





