శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి జోన్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశభక్తి పూరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోన్ కమిషనర్ నారాయణ్ అమిత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జోన్ పరిధిలోని వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, సిబ్బంది, సర్కిల్-49 అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుక ఉన్న ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణ్ అమిత్ మాట్లాడుతూ పారదర్శక పాలన, పౌరులకు నాణ్యమైన సేవల అందజేత, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సౌభాగ్యం కోసం ప్రతి ఉద్యోగి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ముగింపులో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ అధికారులు, సిబ్బంది రాష్ట్ర పురోగతికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.






