నమస్తే శేరిలింగంపల్లి: సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చందానగర్ పోలీసుల ఆద్వర్యంలో తారానగర్ తుల్జాభవానీ ఆలయం వద్ద సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, దోపిడీలు, దొంగతనాలు జరిగినప్పుడు దుండగులను త్వరిత గతిన పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహద పడుతాయని అన్నారు. తారానగర్ మార్కెట్లోని వ్యాపారులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో స్థానికంగా నైట్ విజన్ కెమెరాల ఏర్పాటుకు ఆయన పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు తమ దుఖాణాలలో అదేవిధంగా అందరు ఒక కమిటీగా ఏర్పడి తారానగర్ మార్కెట్ మొత్తంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇటీవల తారానగర్లోని రెహాన్ జ్యూవేలరీలో చోటు చేసుకున్న భారీ చోరి నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందిచింన స్థానిక వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు సుముఖత వ్యక్తం చేశారు. బంగారం దుఖాణాలు, వస్త్ర వ్యాపారులు, ఇతర వ్యాపారస్థులు ఇలా మూడు బృందాలుగా విడిపోయి మార్కెట్ మొత్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అహ్మద్ పాషా, స్థానిక వ్యాపారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.






