నమస్తే శేరిలింగంపల్లి: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లల్లోని వ్యర్థాలను తడి, పొడి చెత్తలుగా వేరు చేసి స్వచ్ఛ్ ఆటోల్లో వేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా తడి, పొడి చెత్త సేకరణ కోసం జిహెచ్ఎంసి ద్వారా మంజూరైన 32 స్వచ్ఛ ఆటోలను శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడంతో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కొత్తగా ప్రారంభించిన స్వచ్ఛ ఆటోల్లో ప్రతి రోజూ ఒక్కో స్వచ్ఛ ఆటో 600 ఇళ్ళ నుండి చెత్త సేకరిస్తుందని, ప్రతి స్వచ్ఛ ఆటోలో తడి, పొడి చెత్తకు వేర్వేరు పార్టిషన్ ఉండడంతో పాటు ప్రమాదకర వ్యర్థాలకు సపరేట్ బాక్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకొని ఖాళీ స్థలాల్లో చెత్తను వేయకుండా భాద్యతగా స్వచ్ఛ ఆటోలకు అప్పగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్ వెంకన్న, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి విటల్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, ఏఎంహెచ్ఓ నగేష్ నాయక్, సీనియర్ నాయకులు శివ సింగ్, రంగస్వామి, గోపాల్, బబుల్ సింగ్, చిన్న, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.