శేరిలింగంపల్లి, జనవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ శుభోదయ కాలనీలో ఒక సంవత్సరం కాలం పూర్తి అయిన శిలాఫలకానికి మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో శుభోదయ కాలనీలో ఒక రూపాయి పని కూడా చేయని ప్రజాప్రతినిధులకు ఈ నిరసన అంకితం అని అన్నారు. శిలాఫలకం పెట్టి సంవత్సర కాలం పూర్తి అయినా ఒక పని కూడా పూర్తి చేయని వైనం అని, పేరుకే శిలాఫలకాలు, పనులు మాత్రం శూన్యం అని అన్నారు. ఎమ్మెల్యే ఇలాంటి శిలాఫలకాలు ఎన్ని ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని అన్నారు. శిలాఫలకాలు పెట్టి ప్రజలను మభ్య పెట్టవద్దని, త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. ముందు పెట్టిన శిలాఫలకాల పనులు పూర్తి చేసి మళ్ళీ కొత్త శిలాఫలకాలు పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ సలీం, చందర్ రావు, ప్రమోద్, అనంత రెడ్డి, మల్లేష్, ఎండి ఫయస్, శబనా, సునీత తదితరులు పాల్గొన్నారు.






