శేరిలింగంపల్లి, డిసెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారులపై ట్రాఫిక్ సక్రమంగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఐ ప్రశాంత్ తెలిపారు. ఆల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద కొండాపూర్ నుంచి వచ్చే వాహనాల కారణంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడడంతో గత కొద్ది రోజుల క్రితం ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు తెలిపారు. కొండాపూర్ నుంచి వస్తూ మియాపూర్ వైపు వెళ్లే వాహనాలకు మదీనాగూడ వద్ద సుమారుగా 300 మీటర్ల దూరంలో కుడి వైపు టర్న్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఆ టర్న్ వద్ద కూడా ట్రాఫిక్ భారీగా ఉంటుండడాన్ని గమనించామని, ఈ క్రమంలోనే ఆ టర్న్ను తాత్కాలికంగా మూసివేస్తున్నామని, దీని కారణంగా ట్రాఫిక్ ఎప్పటిలాగే యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.






