శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్ హుడా కాలనీ, ఆర్టీసీ కాలనీ పరిధిలో ఉన్న మల్లయ్యకుంట చెరువును అభివృద్ధి చేయాలని, చెరువులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లయ్యకుంట చెరువు ఆయా కాలనీవాసులకు భూగర్భ జలాలకు నిలయంగా ఉందని, మల్లయ్య కుంటను అభివృద్ధి పేరున ఎండగట్టి ప్రజలకు భూ ఆధారిత నీళ్లకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిరూపయోగంగా మారిందని, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని, డ్రైనేజీ నీరు చేరి వీధి కుక్కలకు స్విమ్మింగ్ పూల్ అనే విధంగా మారిందని, చెరువులో చెత్త డంపింగ్ చేస్తున్నారని అన్నారు. వెంటనే చెరువును శుభ్ర పరిచే చర్యలు చేపట్టడంతోపాటు చెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఉప కమిషనర్ను కోరారు. ఈ కార్యక్రమంలో మదీనాగూడ డివిజన్ సీనియర్ నాయకులు రమణయ్య, సత్యనారాయణ రాజు, రాజు ముదిరాజ్, పాలం శ్రీనివాస్, అమర్నాథ్ రెడ్డి, వెంకటేష్ ముదిరాజ్, రామ్ మోహన్, దేవేందర్ రావు పాల్గొన్నారు.






