శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్-48 పరిధిలోని స్టాలిన్ నగర్లో కొనసాగుతున్న వరదనీటి నాలా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు అదనంగా 160 మీటర్ల మేర నాలా నిర్మాణాన్ని చేపట్టాలని ఎంసీపీఐ(యూ) నాయకులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారులను డిమాండ్ చేశారు. స్టాలిన్ నగర్లో జరుగుతున్న నాలా నిర్మాణ పనులను ఎంసీపీఐ(యూ) నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టాలిన్ నగర్కు ఆనుకుని ఉన్న దొంగలగుట్ట ఎగువ ప్రాంతం నుంచి వర్షాకాలంలో భారీగా వచ్చే వరద నీటి కారణంగా కాలనీవాసులు ప్రతిసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం గత ఎనిమిదేళ్లుగా జీహెచ్ఎంసీ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించడంతో ప్రస్తుతం నాలా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం చేపడుతున్న పనులను రానున్న వర్షాకాలానికి ముందే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.

అలాగే స్టాలిన్ నగర్కు ఆనుకుని ఉన్న మరో 160 మీటర్ల ప్రాంతంలో కూడా నాలా నిర్మాణ పనులను ఇదే ప్రాజెక్టులో భాగంగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదంశెట్టి రమేష్, నాయకులు ఈ. భాగ్యమ్మ, ఎన్. నాగభూషణం, డి. శ్రీనివాసులు, శంకర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.





